మావద్ద అమలుచేస్తాం.. అధ్యయనం చేస్తున్నాం
హిమాచల్ప్రదేశ్ సీఎస్ రామ్సుభాగ్ సింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 : తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్సుభాగ్ సింగ్ కొనియాడారు. ఈ పథకాల గురించి తెలుసుకొని.. అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలోనూ అమలుచేయడానికి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ సచివాలయం బీఆర్కేభవన్కు వచ్చిన రామ్ సుభాగ్ సింగ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్కు అనుగుణంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ఫ్లాగ్షిప్ కార్యక్రమాల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర ఉన్నతాధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, పంచాయతీరాజ్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రొటోకాల్ విభాగం అదనపు కార్యదర్శి అర్విందర్సింగ్ పాల్గొన్నారు.