హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : కొత్త సినిమాల విడుదల సమయంలో ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతితో టికెట్ల ధరలు పెంచడం, ఆ పెరిగిన మొత్తంలో వాటాలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాల మధ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని సీపీఐ సీనియర్ నేత కే నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రముఖ హీరో ఇంట్లో సమావేశమై వివిధ అంశాలపై సినిమా పెద్దలు చర్చలు జరిపినట్టు టీవీల ద్వారా తెలిసిందని, పెద్ద సినిమాలకు భారీ ఖర్చులు అవుతున్నాయనే పేరుతో బెనిఫిట్, ప్రత్యేక షోలు అంటూ సామాన్య ప్రజలపై అదనపు భారం మోపడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
కళల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేయడం సరికాదని హితవు పలికారు. సినిమా అనేది ఒక వినోదం అని, అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలే గానీ, కొద్దిమంది వ్యాపారస్తుల ప్రయోజనాలకు వేదిక కాకూడదని పేర్కొన్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వాలకు స్పష్టమైన, పారదర్శకమైన పాలసీ ఉండాలని సూచించారు. సినిమాలకు ధరల పెంపుతో ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రత్యామ్నాయ సైట్లు పుట్టుకొస్తాయని హెచ్చరించారు. ప్రజల ఆర్థికస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి, సినిమా పెద్దలకు నారాయణ సూచించారు.