ఆదిలాబాద్ : సాధారణంగా ఉద్యోగులు, ఒక హోదాలో ఉన్నవారు.. ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం చూస్తుంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడంతో అందరూ సర్కార్ దవాఖానాల వైపే చూస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హైకోర్టు న్యాయవాది ప్రసవించి, పలువురికి ఆదర్శంగా నిలిచారు.
భీంపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సిరిగిరి శిల్ప వృత్తిరీత్యా హైకోర్టు న్యాయవాది. నిర్మల్ జిల్లా వాసిని శిల్ప వివాహం చేసుకుంది. అయితే తొలి కాన్పు కోసం శిల్ప ఇటీవలే పుట్టినిల్లు లక్ష్మీపూర్కు వచ్చింది. నెలలు నిండడంతో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిల్ప చేరింది. వైద్యాధికారి విజయసారథి సారథ్యంలో వైద్యబృందం ఆమెకు గురువారం నార్మల్ డెలివరీ చేయగా, మగబిడ్డ జన్మించాడు.
పలు ప్రయివేటు ఆస్పత్రులు ఉన్నప్పటికీ, తమ సొంతూరు భీంపూర్ పీహెచ్సీ గురించి తెలిసే ఇక్కడ చేరినట్లు శిల్ప పేర్కొంది. ఇప్పటికే కాయకల్ప అవార్డు అందుకున్న ఈ దవాఖానలో సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను తెలియజెప్పేందుకే తన భర్త అశోక్ సహకారంతో ఇక్కడ కాన్పు చేయించుకున్నానని తెలిపింది. ఆమెను డీఎంహెచ్వో నరేందర్రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు వైద్యసిబ్బంది కేసీఆర్ కిట్ అందజేశారు.