హైదరాబాద్ : నగరంలో ప్రజల భద్రతతో పాటు జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణ కు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వెటర్నరీ, హెల్త్ తదితర శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీ లత రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. వీధి కుక్కల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇటీవల అంబర్ పేట లో నాలుగు సంవత్సరాల బాలుడు కుక్కల దాడిలో గాయపడి మృతిచెందడం విచారకరమని పేర్కొన్నారు. నగరంలో నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలకు స్టెరిలై జేషన్ నిర్వహించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా బస్తీలు, కాలనీ ల పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
అధికంగా కుక్కలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని HMDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. మాంసపు షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్ధాలను రోడ్లపై వేస్తున్న కారణంగా కుక్కల సంఖ్య ఎక్కువవుతుందని పేర్కొన్నారు. ఈ షాపుల వద్ద రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోతులు, కుక్కల సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని నగర ప్రజలకు సూచించారు. ప్రత్యేక యాప్ ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన జంతువులను సూచించిన ప్రాంతాల్లోనే దహనం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్ హెల్త్ శృతి ఓజా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ జోనల్ కమిషనర్ లు పాల్గొన్నారు.