హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): అమెరికా నుంచి హైదరాబాద్కు 1.42 కిలోల హైగ్రేడ్ గంజాయిని తరలించిన ఇద్దరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబాద్ బృందం సోమవారం అరెస్టు చేసింది. నిందితులు ఎయిర్టైట్ పరుపులో గంజాయిని పార్సిల్చేసి కొరియర్ ద్వారా తరలించినట్టు గుర్తించింది. డార్క్నెట్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇలా గంజాయితోపాటు పలురకాల డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకొస్తున్నట్టు నిందితులు అంగీకరించారని, ఇంతకుముందు పలుమార్లు డ్రగ్స్ తీసుకొచ్చి కాలేజీ విద్యార్థులకు అమ్మినట్టు ఒప్పుకొన్నారని ఎన్సీబీ బెంగళూరు జోనల్ డైరెక్టర్ అమిత్ గవాతే వెల్లడించారు. గతేడాదిలో గ్రీస్ నుంచి కేజీ హైగ్రేడ్ గంజాయిని తెప్పించిన వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు.