హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ బదిలీల విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. మల్టిజోన్-2 పరిధిలో పదోన్నతులపై హైకోర్టు స్టే ఉన్నందున ప్రస్తుతానికి వాటిని పక్కనబెట్టి, బదిలీలు ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారమే ఈ జోన్ పరిధిలోని టీచర్ల బదిలీలను మల్టిజోన్-1తో సమానంగా పూర్తిచేయనున్నది. శుక్రవారం డీఈవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన విద్యాశాఖ అధికారులు.. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు యథాతథంగా పూర్తిచేయాలని ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది.
బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో మల్టిజోన్-2లో హైదరాబాద్ మినహా 12 జిల్లాల్లోని జిల్లా పరిషత్ టీచర్ల పదోన్నతులు నిలిచిపోయాయి. హైదరాబాద్లో జడ్పీ స్కూళ్లు లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలలే ఉండటం, సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాలు లేకపోవడంతో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ కొనసాగుతున్నది. శుక్రవారం వరకు మల్టీజోన్2లోని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు , మల్టిజోన్1లోని అన్ని స్కూళ్ల కు చెందిన 2,217 మంది టీచర్లు పదోన్నతి కోసం వెబ్ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరిలో 1,241 మందికి హెచ్ఎంగా పదోన్నతి దక్కే అవకాశం ఉన్నది. శనివారం వెబ్ఆప్షన్ల ఎడిటింగ్కు అవకాశమివ్వగా, ఆదివారం పదోన్నతి ఉత్తర్వులు వెలువడుతాయి.
500కు పైగా కేసులు
టీచర్ల బదిలీలు, పదోన్నతులపై 500పైగా కేసులున్నట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవన్నీ సర్వీస్ సంబంధ కేసులేనని సమాచారం. దీంతో రోజూ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తున్నదని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. మల్టిజోన్-2లో పదోన్నతులు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ జోన్ పరిధిలోని పలువురు టీచర్లు పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు నేతృత్వంలో విద్యాశాఖ అధికారులను కలిసి, కేసును త్వరగా పరిష్కరించాలని కోరారు.