హైదరాబాద్: రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలో చెప్పాలని పిటిషనర్ను కోరింది. కనీస మద్దతు ధర చట్టంలో ఏముందో చెప్పాలంది. రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ. మూడు లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని కొనియాడింది.
రైతుల కుటుంబాలకు సాయం చేయడం చిన్న విషయం కాదని, రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం గొప్ప విషయమని వ్యాఖ్యానించింది. అయినా, కనీస మద్దతు ధర చట్టంలో ఏముందో, ఏ చట్టం కింద ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలో పిటిషనర్ను ప్రశ్నించింది. అయినా, చట్టాలు చేసేలా ప్రభుత్వానికి న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇవ్వలేవని తేల్చి చెప్పింది. చట్టాలను అమలు చేయాలని మాత్రమే కోర్టులు ఉత్తర్వులు ఇవ్వగలవని స్పష్టం చేసింది.
ఈ పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు లేదా వడ్లను తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా వడ్లను కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ న్యాయ శాస్త్ర విద్యార్థి బి.శ్రీకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ, ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కనీస మద్దతు ధర రూ.1960గా ప్రకటిస్తే ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయక రైతులు రూ.వెయ్యికే అమ్ముకుంటున్నారని చెప్పారు. వాతావరణలో తేమ అధికంగా ఉన్నందు వడ్లు దెబ్బతింటున్నాయని, తక్షణమే వడ్లను కొనుగోలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగానే హైకోర్టు పైవిధంగా పిటిషనర్ను ప్రశ్నించింది. ప్రభుత్వం రైతు ఉద్యమంలో మరణించిన 700 మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడంపై హర్షాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, వడ్లను కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకుని మరణించలేదని, గుండెపోటు వచ్చి చనిపోయారని చెప్పారు.
అయినా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా వడ్లను కొనుగోలు చేయడం మొదలు పెట్టిందన్నారు. 4.53 లక్షల మంది రైతుల నుంచి 27 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించామని, ఇప్పటికే రూ.2800 కోట్లను రైతులకు చెల్లించామని చెప్పారు. వచ్చే జనవరి నెలాఖరు వరకు వడ్ల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇందుకోసం 6349 వడ్ల సేకరణ కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులను అన్ని విధానాలుగా ఆదుకునే ప్రభుత్వాల్లో తెలంగాణ ముందుందని చెప్పారు.
ఈ పిల్ను కొట్టేయాలని కోరారు. వాదనల తర్వాత ధర్మాసనం.. రైతుల నుంచి వీలైనంత మేరకు వడ్లను కొనుగోలు చేయాలని సూచన చేసింది. పూర్తి వివరాలతో ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి నెలకు వాయిదా వేసింది.