హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీ ముబార క్ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై అత్యవసర విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. అప్పీల్ పిటిషన్కు రిజిస్ట్రీ నంబర్ కూడా కేటాయించకుండానే విచారణ ఎలా చేపడతామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఈ అప్పీల్పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉన్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన ప్రధాన కేసు ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద వి చారణలో ఉంది.
ఈ పథకాల అమలు కు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, నిధు ల సమకూర్పు, శాసనసభ ఆమోదం తదితర అంశాలపై న్యాయస్థానం వివరణ కో రింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంట ర్ లో రాజ్యాంగంలోని 162వ అధికరణా న్ని వక్రీకరించినట్టు ఉన్నదని సింగిల్ జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అంశాన్ని సవరించి మళ్లీ కౌంటర్ దాఖలు చేయాల ని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ వేయలేదు. ఈ పథకాలకు నిధులను ఏవిధంగా సమకూరుస్తున్నారో స్పష్టం చేయకుండానే ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఆ పథకాల అమలుపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ప్రధాన కేసులో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసే కౌంటర్లు దాఖలు చేయకుం డా స్టేను సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.