హైదరాబాద్, అక్టోబర్ 17, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణను నిలిపివేసేందుకు హైకో ర్టు నిరాకరించింది. ఇప్పటికే ప్రక్రియ మొదలైనందున ప్రస్తుత దశలో స్టే విధించలేమని ప్రకటించింది. అయితే, ఈ నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల చట్టంలో సెక్షన్ 10ఏని చేర్చుతూ జారీ అయిన జీవో 18కు వ్యతిరేకంగా 16 మంది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వృత్తివిద్య కాలేజీల్లోని 5 వేల మందికిపైగా కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలన్న నిర్ణయం వల్ల అన్ని అర్హతలున్న నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. దీన్ని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.