హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితాలో సవరణపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో)కు విన్నవించుకోవాలని తెలిపింది. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఓటర్ల జాబితాలో సవరణలపై ఎన్నికల కమిషన్ను సంప్రదించకుండా దాఖలు చేసిన పిటిషన్పై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బోగస్ ఓట్లను తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ ఫిరోజ్ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈఆర్వోలోని సెక్షన్ 21, 22, 23 కింద రివిజన్లు, సవరణలు, తొలగింపులు చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని తేల్చి చెప్పింది. ఈఆర్ఓ ఇప్పటికే రివిజన్ ప్రక్రియ చేపట్టి ఈనెల 19న తుది జాబితాను ప్రకటించారని. ఈ జాబితాపై అభ్యంతరాలకు ఇప్పటికీ అవకాశం ఉన్నందున దానిని సద్వినియోగం చేసుకోవచ్చునని పిటిషనర్కు సూచించింది. పిటిషన్పై విచారణను మూసివేస్తున్నట్టు ప్రకటించింది.