హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సుల్లో సీట్లు మొత్తం తెలంగాణ వారికే చెందాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. జీవో 72 ప్రకారం ఆలిండియా రిజర్వేషన్లు 15 శాతం, 85 శాతం స్థానిక కోటా కింద సీట్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 72 మేరకు సీట్ల సంఖ్య, సీట్ల కేటాయింపుల వివరాలను నివేదించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్, డెంటల్ సీట్ల భర్తీకి సంబంధించిన నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న జారీ చేసిన జీవో 72ను ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో సవాలు చేశారు. జీవో ప్రకారం తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా నెలకొల్పిన 34 వైద్య కళాశాలల్లోని 8,215 సీట్లలో ఆలిండియా రిజర్వేషన్ 15 శాతం, స్థానికులైన తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్ల కేటాయింపును అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, కాళోజీ యూనివర్సిటీ న్యాయవాది ప్రభాకర్రావు సమర్థించారు. జీవో 72 నిబంధనలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం కాదన్నారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఉన్న 20 కాలేజీల్లో 2,850 సీట్లు ఉన్నాయని వీటిని రెండు రాష్ట్రాల విద్యార్థులను స్థానికులుగానే పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల విభజన జరిగేనాటికి ఉన్న కాలేజీలకు మాత్రమే సెక్షన్ 95 వర్తిస్తుందని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.