హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ సమీపంలో ఉన్న మీర్ఖాన్పేట్ ఔటర్ రింగురోడ్డు నుంచి రీజినల్ రింగురోడ్డు దాకా చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించనున్న భూముల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. భూసేకరణకు సంబంధించి పిటిషనర్లకు చెందిన 61 ఎకరాలకు అవార్డు (పరిహారం) ప్రకటించేదాకా రైతులను భూముల నుంచి ఖాళీ చేయించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామం, కడ్తాల్ మండలం, ముద్విన్ మండలం, ఆమనగల్ మండలం ఆమనగల్, ఆకుతోటపల్లి గ్రామాల్లో 554.34 ఎకరాల భూసేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ 98 ఏండ్ల శ్రీపతి అహల్యాదేవి సహా మరో 30 మంది దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ సోమవారం విచారించారు. భూసేకరణ చట్టం నిబంధనల మేరకు ఇక్కడ భూసేకరణ జరగడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు చట్ట నిబంధనలు ఉల్లంఘించి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. బాధిత రైతుల అభ్యంతరాలు స్వీకరించకుండా, పిటిషనర్ల వాదన వినకుండా భూసేకరణ ప్రక్రియ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా అధికారులు ప్రారంభించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లలో పిటిషనర్ల భూమికి చెందిన నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, 554 ఎకరాల్లో 200 ఎకరాలపైనే వివాదం ఉన్నదని చెప్పారు. ఇప్పటికే కొంత భూమికి పరిహారం మంజూరు చేసినట్టు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ స్టే ఇవ్వరాదని కోరారు. పిటిషనర్లకు పరిహారం చెల్లించాక భూమిని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. వాదనల అనంతరం హైకోర్టు, పిటిషనర్లకు పరిహారం చెల్లించేదాకా వారిని భూముల నుంచి ఖాళీ చేయించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేసింది.