హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో అధికారులకు చట్టబద్ధమైన విధులు నిర్వహించడానికి కూడా ఆదేశాలు జారీచేయాల్సి వస్తున్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రెవెన్యూ సమస్యల పరిషారంలో అసాధారణ జాప్యం జరుగుతున్నదని, ఈ కారణాలతో కోర్టుకు వచ్చే వారి సంఖ్య పెరిగి కోర్టులపై భారం పెరుగుతున్నదని పేర్కొంది. సాధారణంగా ఎదురయ్యే ఎఫ్ లైన్, సర్వే, రెవెన్యూ రికార్డుల సవరణ, అదృశ్యమైన సర్వే నంబర్ల వివరాలు, మ్యుటేషన్ తదితర సమస్యల పరిషారానికి ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్వోపీ)ని నాలుగు వారాల్లో రూపొందించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది.
మ్యుటేషన్ కోసం గత ఏడాది అక్టోబరు 27న దరఖాస్తు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడా న్ని సవాలు చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన లోకనడిపి హన్మాండ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వినతిపత్రం ఇచ్చి ఎనిమిది నెలలైనా రెవెన్యూ అధికారులు మ్యుటేషన్పై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒకే రకమైన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకున్నప్పటికీ దరఖాస్తుదారులకు చేరవేయడంలో జాప్యం జరుగుతున్నదని అన్నారు. ఈలోగానే వారు పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఇలాంటి ఒకే రకమైన సమస్యల పరిషారానికి ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్వోపీ)ని రూపొందించి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 8కి వాయిదా వేశారు.