హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్ ) మే 15లోగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంత అవసరాలకు వాడుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. దీంతో హైకోర్టులో సీసీఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై జస్టిస్ పీ మాధవిదేవి ఇటీవల విచారణ చేపట్టారు. ఈ సదర్భంగా గవర్నమెంట్ ప్లీడర్ వాదన వినిపిస్తూ..
నెలనెలా రూ.10 కోట్లు చెల్లించాలన్న కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే సీసీఎస్కు ఓసారి రూ.38 కోట్లు, మరోసారి రూ.6 కోట్లు డిపాజిట్ చేసినట్టు చెప్పారు. దీనిపై సీసీఎస్ తరఫు న్యాయవాది ఏకే జయప్రకాశ్రావు స్పందిస్తూ.. నిరుడు నవంబర్ 25న కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తొలి నాలుగు వారాల్లో రూ.100 కోట్లు, తర్వాత నాలుగు వారాల్లో మరో రూ.100 కోట్లు డిపాజిట్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో మే 15లోగా సీసీఎస్కు రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని ఆర్టీసీ యాజమాన్యానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు.. తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.