హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సంచలనం రేకెత్తించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ప్రతివాదులుగా ఉన్న పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వాదనలు కూడా విన్న తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు ఎన్కౌంటర్ అయ్యారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారించింది.
ఇందులో తమ వాదనలు కూడా వినాలంటూ దిశ తండ్రి, పోలీసులు మధ్యంతర వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసులపై ఐపీసీ 302 కింద హత్యా నేరం కేసు నమోదు చేయాలని పిటిషనర్ల తరఫు వాదించారు. దర్యాప్తు పూర్తయ్యాక కోర్టుల జోక్యానికి ఆసారం లేదని, ఒక ఎఫ్ఐఆర్ దాఖలైన తర్వాత మరో ఎఫ్ఐఆర్ వేయడానికి కూడా వీల్లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువాదనలు విన్న తర్వాత హైకోర్టు స్పందిస్తూ, తాజా దర్యాప్తునకు ఆదేశించే హకు తమకు ఉన్నదని తెలిపింది. అందుకే ప్రతివాదులుగా పోలీసుల వాదనల నిమిత్తం వారందరికీ నోటీసులు ఇస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.