హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్/జూనియర్ లైన్మెన్ల నియామకాల్లో సర్వీసు లెకింపుపై వివరణ ఇవ్వాలంటూ ఎన్పీడీసీఎల్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎస్ఈ, డివిజనల్ ఇంజినీర్ తదితరులకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. హైకోర్టు 2009 నవంబరు 10న ఇచ్చిన తీర్పు ప్రకారం నియమితులైన వారందరికీ ఒకే సీనియారిటీ వర్తింపజేయకపోవడాన్ని సవాలు చేస్తూ 2011లో నియమితులైన వందలమంది హైకోర్టులో 12 పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్ బుధవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపిస్తూ ఒకే నోటిఫికేషన్ ఆధారంగా 2007లో కొందరు, 2011లో పిటిషనర్లు నియమితులయ్యారని తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం అందరినీ 2007లో నియమితులైనవారితో సమానంగా సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని, వేతనాలు, పదోన్నతులు వాటి ఆధారంగా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దీనికి విరుద్ధంగా 2011లో నియమితులైనవారిని సర్వీసులో జూనియర్లుగా పేరొంటున్నారని తెలిపారు.
ఎన్పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2007లో ప్రకటించిన ఖాళీల మేరకు పోస్టులను భర్తీ చేశామన్నారు. 2011లో ఏర్పడిన ఖాళీల ఆధారంగా పిటిషనర్ల నియామకం జరిగిందని, అందువల్ల అప్పటినుంచే సర్వీసు ప్రారంభమవుతుందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ 6 వారాలకు విచారణను వాయిదా వేశారు.