హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. మొయినాబాద్ ఫామ్హౌస్లో పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సమలత.. నిందితుల రిమాండ్కు అనుమతిస్తూ తీర్పు వెలువరించారు. వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.
కాగా, పోలీసుల పిటీషన్పై శుక్రవారం వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో కీలక వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంప్రదింపులు జరపరాదని శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రతివాదులు హైదరాబాద్లోనే ఉంటారని, సమగ్ర వాదనలకు గడువు కావాలని వారి తరఫు న్యాయవాది కోరడంతో విచారణ నేటికి వాయిదా పడింది. శనివారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితుల రిమాండ్కు అనుమతిస్తూ తీర్పును వెలువరించారు.