హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఒకే అంశంపై ఎన్ని పిటిషన్లు వేస్తారని గురుకుల కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లను హైకోర్టు ప్రశ్నించింది. సర్వీసు క్రమబద్ధీకరణ, ఇంక్రిమెంట్లు, జీతాల బకాయిల చెల్లింపు ఇలా పలు అంశాలపై వేర్వేరుగా పిటిషన్లు వేయడాన్ని తప్పుబట్టింది. దీనివల్ల కోర్టుల, అధికారుల సమయం వృథా అవుతుందని ఆక్షేపించింది. వివిధ జిల్లాల్లో తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న 116 మంది జూనియర్ లెక్చరర్లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడి న ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. మినిమమ్ టైం స్కేల్కు సంబంధించిన కేసులో పిటిషనర్లను విధుల నుంచి తొలగించడంతో వారిని తిరిగి చేర్చుకోవాలని ఒక కేసు, 12 నెలలకు జీతం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలు అమలుకాకపోవడంతో కోర్టుధికార కేసు, ఇంక్రిమెంట్లు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని మూడో కేసు వేయాల్సివచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది ఎం శ్రీకాంత్ వివరించారు.
వేసవి సెలవుల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాతాలిక జూనియర్ లెక్చరర్ల సేవలు అవసరం ఉండదని ప్రభుత్వ న్యాయవాది చిన్నం వాణిరెడ్డి కోర్టుకు వివరించారు. ఆ సమయంలో వారిని తొలగించి, తిరిగి అవసరమైనప్పుడు మళ్లీ అదే ప్రాతిపదికపై నియమిస్తున్నట్టు తెలిపారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు.. 2003 నుంచి తాతాలిక/కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పనిచేసేవారికి శాశ్వత ప్రాతిపదికపై భర్తీ చేసే పోస్టుల్లో ప్రభుత్వం ఏవిధమైన ప్రాధాన్యం ఇస్తున్నదో వివరించాలని ఆదేశించింది. పిటిషనర్ల్ల ఉద్యోగ నియామక వయస్సు మీరిపోయిన విషయంపై సానుకూలంగా స్పందించాలని సూచించింది. వయోపరిమితి, తాతాలిక సేవలకు పాయింట్ల కేటాయింపు మొదలైన వాటి గురించి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.