హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ చేపట్టిన గ్రూప్-1 ఉద్యోగ నియామకాలకు హైకోర్టు అనుమతించింది. అయితే, మహిళల రిక్రూట్మెంట్కు విడిగా రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మొత్తం పోస్టుల్లో రిజర్వేషన్, జనరల్ క్యాటగిరీలో 33% చొప్పున మహిళలకు కేటాయించాలని తెలిపింది. సమాంతర రిజర్వేషన్ల విధానానికి కట్టుబడి ఉండాలి గాని నేరుగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సరికాదంటూ కోడెపాక రోహిత్ తదితరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ పీ మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది సుంకర చంద్రయ్య వాదిస్తూ.. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు అభ్యంతరం లేదని, అయితే, అవికాకుండా మహిళలకు విడిగా రిజర్వేషన్ల కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యంకాదని పేర్కొన్నారు. రాజేశ్కుమార్ దానియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఎకువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే నేరుగా మహిళా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు గ్రూప్-1 పోస్టుల నియామాకాలను కొనసాగించవచ్చునని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.