హైదరాబాద్, డిసెంబర్ 28, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం రామంతాపూర్ పెద్దచెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ నోటిఫికేషన్ జారీ చేయడంలో ప్రభుత్వ శాఖలు జాప్యం చేయడంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖ సహకరించడం లేదని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు చెప్పడం సరికాదని హెచ్చరించింది. సమన్వయంతో నిర్ణయం తీసుకోకపోతే ఆయా శాఖల అధికారులను కోర్టుకు పిలిపించి ఎవరు బాధ్యులో తాము తేలుస్తామని హెచ్చరించింది.
కొత్తగా హెచ్ఎండీఏ, ప్రైవేట్ వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చి వారికి కూడా నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. రామంతాపూర్లో 25 ఎకరాల్లోని పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, దీనివల్ల నీరు కాలుష్యమవుతున్నదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కేఎల్ వ్యాస్ 2005లో రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
ఎఫ్టీఎల్ నిర్ధారణకు తహసీల్దార్ సహకరించడం లేదని పురపాలక శాఖ తరపు న్యాయవాది చెప్పారు. ఎఫ్టీఎల్పై ప్రాథమికంగా 490 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు, వాళ్లంతా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొనేలా అధికారులు కాలయాపన చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పురపాలక శాఖ న్యాయవాది వాదనను రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది తప్పుపట్టారు. ఈ కేసులో హెచ్ఎండీఏ ప్రతివాదిగా లేదని చెప్పారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖలతోపాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను సంప్రదించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని అన్నారు. తాము సహకరిస్తున్నామని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, నివేదిక తప్ప కార్యాచరణ ఏమీ కనిపించడంలేదని వ్యాఖ్యానించింది. హెచ్ ఎండీఏతోపాటు ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.