హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరంలోనూ నిందితులను అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు జారీ చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. హత్యాయత్నం కేసుల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారా? దీనికి ఏవైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అంటూ పోలీసుల తీరును ప్రశ్నించింది. ఇటువంటి కేసుల్లో అరెస్టు చేయకుండా నోటీసులతో సరిపెట్టడం ఎలా సమంజసమవుతుందో పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. తనతోపాటు తన కుమార్తెను హత్య చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నా నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపిస్తూ భారతకుమారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ టీ మాధవీదేవి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భారతకుమారి కోడలు దీక్ష, సంధ్య బన్నూరి కలిసి ఆహారంలో జోల్పిడెమ్ అనే ఔషధాన్ని కలిపి పిటిషనర్తోపాటు ఆమె కుమార్తెను హత్య చేయడానికి ప్రయత్నించారని తెలిపారు.
దీనికి సంబంధించిన ఆధారాలు దర్యాప్తు అధికారుల వద్ద ఉన్నప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ, నిందితుల్లో ఒకరు తొమ్మిది నెలల గర్భిణి కావడంతో వారికి నోటీసులు జారీచేశామని తెలిపారు. కేసులో ఇప్పటికే ఆరోపణల పత్రం దాఖలైందని, నిందితుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సిన అవసరం వచ్చినా లేదా ఏవైనా వస్తువులు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చినా మాత్రమే అరెస్టు అవసరమవుతుందని కోర్టుకు వివరించారు. ఈ వివరణతో సంతృప్తి చెందని న్యాయమూర్తి, హత్యాయత్నం కేసులో కూడా నోటీసులు జారీ చేస్తారా? అన్ని హత్యాయత్నం కేసుల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రత్యుత్తర అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదావేశారు.