హైదరాబాద్, జూన్ 24,( నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం ఏకసభ్య కమిషన్ను నియమించడంపై దాఖలైన అప్పీళ్లలో వివరణ ఇవ్వాలంటూ హెచ్సీఏను హైకోర్టు ఆదేశించింది. హెచ్సీఏలో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సింగిల్జడ్జి ఇటీవల తీర్పు వెలువరిస్తూ.. ఏకసభ్య కమిషన్గా జస్టిస్ నవీన్రావును నియమిస్తూ, హెచ్సీఏ వ్యవహారాల పర్యవేక్షణతోపాటు ఇతర కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం సిట్ ఏర్పాటుచేయాలని డీజీపీని ఆదేశించారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఏ అంబర్పేట క్రికెట్క్లబ్, జిందాతిలిస్మాత్ క్రికెట్ క్లబ్, సాగర్ క్రికెట్ క్లబ్లు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కొందరు తప్పుచేశారన్న కారణంగా మొత్తం కమిటీనే తప్పుగా పరిగణనలోకి తీసుకోవడం సరికాదని వాదించారు. వాదనలను విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని, సంబంధిత రికార్డులను సమర్పించాలని హెచ్సీఏతోపాటు సఫిల్గూడ క్రికెట్ క్లబ్, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.