హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11(నమస్తే తెలంగాణ): హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల కేటాయింపును పౌరసమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. రియల్ వ్యాపారానికి, సంపన్న వర్గాలకు లబ్ధిచేకూర్చేలా, వర్సిటీ భూములకు డిమాండ్ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడింది. హైకోర్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైకోర్టు పరిరక్షణ సమితి ప్రతినిధులు బర్ల మల్లేశ్యాదవ్, శారదాగౌడ్, రిటైర్డ్ ప్రొఫెసర్ వాసుదేవరావు, ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, హైకోర్టు న్యాయవాది భార్గవ్ తదితరులు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. చారిత్రక, వారసత్వ నేపథ్యం ఉన్న హైకోర్టు తరలింపు వెనుక పలు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
పరిరక్షణ సమితి సభ్యులు శారదాగౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగిస్తామంటూ అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కారు హైకోర్టు తరలింపు విషయంలో ఎవరితో సంప్రదింపులు చేసిందని మండిపడ్డారు. ఇప్పటివరకు రెండు పర్యాయాలు జరిగిన జనరల్ బాడీ సమావేశంలోనూ ఈ ప్రతిపాదనను తిరస్కరించిన విషయాన్ని గ్రహించాలని అన్నారు. వంద ఎకరాల్లో కొత్త హైకోర్టును కట్టడం కంటే వందేళ్ల చరిత్ర కలిగిన హైకోర్టును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు.
పౌర హక్కుల కోసం పరితపించే న్యాయవాదులే తమ హక్కులకు భంగం కలుగుతుందని రోడ్డెక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అప్పులు పేరుకుపోయాయని చెప్పిన సీఎం రేవంత్.. ఇంతా హడావిడిగా కొత్త హైకోర్టుకు నిధులు కేటాయించడం, విడుదలకు చర్యలు తీసుకోవడం దేనికని ప్రశ్నించారు. పర్యావరణానికి తీవ్ర నష్టంచేసేలా ప్రభుత్వం నిర్ణయం ఉన్నదని రిటైర్డ్ ప్రొఫెసర్ వాసుదేవరావు మండిపడ్డారు. జీవావరణాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
ప్రజాపాలన పేరిట దగా పాలన
ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయాలు సేకరించాల్సిన ప్రభుత్వమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని హైకోర్టు న్యాయవాది బర్ల మల్లేశ్యాదవ్ ఆరోపించారు. వ్యవసాయం, సాగు పరిశోధనలకు ఆధారమైన సారవంతమైన భూమలలో హైకోర్టు నిర్మిస్తే.. భవిష్యత్తులో పరిశోధనలకు అవసరమైన నేలలను ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్రెడ్డి కూడా హెచ్సీయూలాంటి భూములను లాక్కున్నారని గుర్తుచేశారు. వర్సిటీ భూముల పరిరక్షణ, తరలింపు నిలిపివేసేంత వరకు తాము పోరాడుతామని స్పష్టంచేశారు. ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ మాట్లాడుతూ.. ప్రజాపాలన పేరుతో దగాపాలనకు నిదర్శనంగా హైకోర్టు తరలింపు జరుగుతున్నదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. హైకోర్టు పేరిట డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నదని ప్రశ్నించారు.
బుద్వేల్, శంషాబాద్, గండిపేట్ పరిసరాల్లో ఉన్న సంపన్న వర్గాలకు చెందిన న్యాయాధికారులకు లబ్ధి చేకూర్చే విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. హైకోర్టును తరలించేందుకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలోని కింది స్థాయి కోర్టులను బలోపేతం చేయవచ్చని అన్నారు. పేదల ఇంటి వద్దకే న్యాయ వ్యవస్థను తీసుకుపోవచ్చని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన లక్ష్యాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించేలా ఈ కొత్త హైకోర్టు నిర్మాణం ఉన్నదని మండిపడ్డారు. ప్రభుత్వం పునారాలోచన చేసేంత వరకు హైకోర్టుకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టంచేశారు.
భూముల కేటాయింపు వెనుక కర్ణాటక రియల్ మాఫియా
కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కనుసన్నుల్లోనే అగ్రి బయోడైవర్సిటీ పార్కు భూముల కేటాయింపులు జరిగాయని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆరోపించారు. ఈ భూ కేటాయింపు వల్ల విలువైన వన సంపదను నిర్వీర్యం కావడంతోపాటు వన్యప్రాణులు కూడా హరించిపోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహారించడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతిని సర్వనాశనం చేసే విధంగా అరుదైన జీవవైవిధ్యానికి కేంద్రంగా ఉన్న ఆ భూములను కేటాయించడం సరికాదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బుద్వేల్కు హైకోర్టు తరలింపును నిలిపివేయాలని, అక్కడి వన సంపదను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.