హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ హైదర్బస్తీలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానం ధార్మిక సంస్థగా పరిగణించబడుతున్నదని, ఆ ఆలయ నిర్వహణలో దేవాదాయ చట్టం నిర్దేశించిన నిబంధనలు, విధివిధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయ పాలన, పరిపాలనలో ఈ నిబంధనలను పాటించకపోతే నిధులు దుర్వినియోగమైనట్టు పరిగణించాల్సి ఉంటుందని పేరొన్నది. ఆలయ నూతన సముదాయం నిర్మాణాన్ని సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రీయ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నగిళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారించారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భక్తుల నుంచి ఆ ఆలయ నిర్వహణ కమిటీ సుమారు రూ.16 కోట్లు సేకరించిందని, ఆ నిధుల వినియోగంలో పారదర్శకత లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ నిధులు, ఆస్తుల పరిరక్షణ విషయమై దేవాదాయ శాఖకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదని తెలిపారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇంజినీరింగ్ అనుమతులు తీసుకోలేదని, విరాళాలపై ఆడిట్ కూడా నిర్వహించలేదని పేరొన్నారు.
భక్తుల హకులు, ఆలయ ఆస్తుల రక్షణతోపాటు పారదర్శక పరిపాలన కోసం న్యాయస్థానం జోక్యం అవసరమని విన్నవించారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. దేవాదాయ చట్టం ప్రకారం వివాదాస్పద అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం సంబంధిత అధికారికే ఉంటుందని పేరొన్నది. దేవుడి విగ్రహాన్ని భూతలం నుంచి మొదటి అంతస్తుకు తరలించే ముందు స్థపతి సలహా తీసుకున్నారో లేదో వివరించాలని, కొత్త ఆలయ ప్రారంభానికి ముందు కుంభాభిషేకం లాంటి శాస్త్రోక్త క్రతువులు నిర్వహించారో లేదో తెలియజేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.