హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ఆ దరఖాస్తులను ఆమోదించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు నిర్మల్కు చెందిన పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అసలు అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడమే సరికాదని, కనుక ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను ఆమోదించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.