ACB Court | వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నెలకొల్పిన ప్రత్యేక ఏసీబీ కోర్టును శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ రాజేశ్వరరావు హాజరయ్యారు. ప్రత్యేక ఏసీబీ కోర్టుతో పాటు హనుమకొండ సబ్ కోర్ట్ ఈ సేవ డిజిటలైజేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ కాకతీయుల పాలనతో వరంగల్, హనుమకొండ ప్రాంతం ప్రపంచాన్ని ఆకర్షించగా.. జిల్లా కోర్ట్ సముదాయం కూడా అత్యద్భుతంగా ఉందన్నారు. జాతీయ లోక్ అధాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించి వరంగల్ హనుమకొండ కోర్టులు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈ సేవ కేంద్రం ద్వారా న్యాయవాదులు తమ వాజ్యాలను ఫైల్ చేయాలని కోరారు.
జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ డిజిటలైజేషన్ చేయడంతో భావితరాలకు ప్రస్తుత దస్తావేజులు కోర్టు తీర్పులు అందుబాటులో ఉంటాయన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఇక్కడ న్యాయవాదులు న్యాయమూర్తులు సమష్టిగా కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోక రాధాదేవి, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృష్ణమూర్తి వరంగల్ హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ మోహన్, శ్యామ్ సుందర్ రావు, న్యాయమూర్తులు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సత్యనారాయణ, ఇతర పబ్లిక్ ప్రాసిక్యూటర్లు న్యాయశాఖ సిబ్బంది న్యాయవాదులు పాల్గొన్నారు.