హైదరాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, హయత్నగర్ నుంచి సాహెబ్నగర్కు వెళ్లే ప్రధాన రహదారిపై జనావాసాల మధ్య మద్యం షాపునకు ఎలా అనుమతించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సాయి యువ బార్అండ్ రెస్టారెంట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఎక్సైజ్, హోంశాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్ఎంసీ, ఎక్సైజ్శాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాచకొండ పోలిస్ కమిషనర్, హయత్నగర్ ఎస్హెచ్ఓలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
తమ కాలనీలో నివాసాల మధ్య ప్రధాన రహదారిపై బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పేరొంటూ ఆరో తరగతి విద్యార్థిని ఆర్ వైష్ణవి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ పిల్ను చీఫ్జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. సదరు బార్కు సుమారు 70 మీటర్ల దూరంలోనే పలు పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయని, విద్యార్థులు ఇండ్లకు వెళ్లేప్పుడు ఇబ్బందిగా ఉందని, కోచింగ్కు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఒంటరిగా వెళ్లాల్సివస్తున్నదని ఆ బాలిక వివరించింది. ఈ కేసు విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.