హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): అధిక రక్తపోటు సాధారణంగా మగవారిలో ఎక్కువగా కనిపించేది. కానీ మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో పురుషులకు దీటుగా పనిచేస్తున్న మహిళలను సైతం అధిక రక్తపోటు సమస్య పట్టిపీడిస్తున్నది. ముఖ్యంగా పట్టణ ప్రాంత మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తున్నట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 24.8 శాతం మంది మహిళలు బీపీతో బాధపడుతున్నారు. మనదేశ జనాభాలో 24 శాతం మంది పురుషులు, 21.3 శాతం స్త్రీలు బీపీతో బాధపడుతున్నట్టు ఆరోగ్య సర్వేలో తేలిందని డాక్టర్ స్వాతి గోగినేని వెల్లడించారు. తెలంగాణలో 26.1 శాతం మహిళలు అధిక రక్తపోటును ఎదుర్కొంటున్నారు. సాధారణంగా కుటుంబ బాధ్యతలు, ఇతరత్రా కారణాల వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలోనే బీపీని గుర్తించకపోవటం, పట్టించుకోకపోవటం చేస్తుంటారని, హైపర్ టెన్షన్తో బాధపడే స్త్రీలల్లో 14.5 శాతం మంది మాత్రమే చికిత్స పొందుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
అధిక రక్తపోటుకు చికిత్స తీసుకోకుండా అలానే వదిలేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీపీతో బాధపడే స్త్రీలలో కంటిచూపు సమస్యలు పెరిగే ప్రమాదమున్నది. పక్షవాతం, లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారి తీయవచ్చు. ఇతర వ్యాధులకంటే గుండె జబ్బులే మహిళలను అధికంగా బలితీసుకుంటున్నాయని నివేదికలు చెప్తున్నాయి.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహారంలో ఉప్పును బాగా తగ్గించాలి. రోజుకు 4వందల మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. శారీరక కదలికలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శారీరక శ్రమ చాలా ముఖ్యం.