హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాది రాయిపడ్డ ఖమ్మం గుమ్మం ఇప్పుడు జాతి ముఖచిత్రాన్ని మార్చే వేదిక కానున్నది. తెలంగాణ వాదానికి పరీక్షగా నిలిచిన చోటు ఇప్పుడు బంగారు భారతాన్ని కలగంటున్నది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 18న ఖమ్మం వేదికగా జాతి జీవనాడిని పరిరక్షించే మహోద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా జాతిముందు తన అజెండాను ఆవిష్కరించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా నలుగురు సీఎంలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్యాదవ్ ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఏం చేయబోతున్నారు? ఖమ్మం బహిరంగ సభ ద్వారా ఏ కార్యాచరణను ప్రకటించబోతున్నారు? అన్న అంశాలపై ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఖమ్మం చారిత్రక నేపథ్యం…తెలంగాణ ఉద్యమం, సీఎం కేసీఆర్ చేపట్టిన రాజకీయోద్యమానికి ఉన్న విడదీయరాని అనుబంధం గురించి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఆధిపత్యం, వివక్ష, నిర్లక్ష్యం, అవమానాలకు గురైన తెలంగాణ బిడ్డలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే కాంక్ష 1956 నుంచి ఉందని ఖమ్మం నిరూపించింది. 1969 జనవరి 8న కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్ రెండు వారాలు ఆమరణ దీక్ష చేపట్టారు. దీనికి మార్గదర్శిగా కొలిశెట్టి రామదాసు వ్యవహరించారు. 18 నెలలపాటు టీఎన్జీవోలు, కార్మికులు, నిరుద్యోగుల ఆందోళనలు నిర్వహించిన తర్వాత విద్యార్థులు ఉద్యమంలోకి దిగారు.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా ఈ నెల 18న ఖమ్మంలో పార్టీ నిర్వహించతలపెట్టిన బహిరంగసభ ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి సీఎం కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సహా ఎమ్మెల్యేల నుంచి మొదలుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు బహిరంగసభ విజయవంతానికి సన్నద్ధం అవుతున్నారు.
‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’..అంటూ స్వరాష్ట్ర కాంక్షను తెలంగాణ నరనరాన రగిలించిన వేదిక ఖమ్మం. ఇక్కడ తెలంగాణ వాదమేలేదని నీలిగినవాళ్లకు ‘గిదిరా ఖమ్మం’ అని నిరూపించిన నాయకుడు కేసీఆర్. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టకుండా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అల్గునూర్ వద్ద ఆక్టోపస్ పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నడుమ ఆయనను ఖమ్మం తరలించి మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి కేసీఆర్కు 14 రోజుల రిమాండ్ విధించడంతో సబ్ జైలుకు తరలించారు. 2009 నవంబర్ 30న ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడే 2 రోజులు ఆమరణ దీక్షను కొనసాగించారు. డిసెంబర్ 3న ఖమ్మం ప్రభుత్వ దవాఖాన నుంచి కేసీఆర్ను నిమ్స్కు తరలించేదాకా ఖమ్మంలో రాజుకున్న అగ్గి తెలంగాణ అంతటా పరివ్యాప్తమై డిసెంబర్ 9 ప్రకటనకు దోహదమైంది.