కొల్లాపూర్ : కశ్మీర్లో (Kashmir) చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తెలిపారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యాటకులకు తగిన సహాయం అందిస్తామని అన్నారు
. ఈ ఘటనపై తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇటీవల జమ్ము, కశ్మీర్లో ప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి కోరారు.
పర్యాటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు, అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశామని, కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల సహాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పర్యాటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం హెల్ప్ లైన్ (Helpline) నంబర్లు 9440816071, 9010659333, 040 23450368 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.