హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): భూ సమస్యలపై ప్రజలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించుకొనేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటుచేసింది. ఇందుకోసం వాట్సాప్ నంబర్ ‘9133089444’ను, మెయిల్ ఐడీ ascmro@telangana.gov.in ని కేటాయించింది. ధరణికి సంబంధించి ఎలాంటి అభ్యర్థనలు, ఫిర్యాదులు ఉన్నా.. హెల్ప్లైన్కు వివరాలు పంపాలని సూచించింది. ఈ హెల్ప్లైన్ శనివారం ఉదయం 10 గంటల తర్వాత అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. రాష్ట్రంలో భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా హెల్ప్లైన్ అవసరమని నిర్ణయించి, వెంటనే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన అభ్యర్థనలు, ఫిర్యాదులను నిత్యం పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో సీసీఎల్ఏ, ఐటీ, ఈ అండ్ సీ విభాగాలకు చెందిన అధికారులు ఉంటారు.
వేగంగా పరిష్కరించండి
భూ సమస్యలపై ధరణి పోర్టల్లో వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ వీలైనంత త్వరగా పరిష్కరించాలని సమీక్ష సందర్భంగా సీఎస్ ఆదేశించారు. పోర్టల్తోపాటు వాట్సప్, ఈ మెయిల్ తదితర మార్గాల్లో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై స్పందించాలని, వాటి స్థితిగతులను రోజువారీగా సమీక్షించాలని సూచించారు. దీంతోపాటు ధరణి పోర్టల్, మాడ్యూల్స్, ఇతర అంశాలను సమీక్షించారు. కార్యక్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ సీఐజీ శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్రోస్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఐఆర్ఎస్ ఎండీ వెంకటేశ్వర్రావు, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితరులు పాల్గొన్నారు.