హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఇతరవర్గాల్లోని చిన్న పారిశ్రామికవేత్తలకు వారి పరిశ్రమల విస్తరణకు చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపార, మార్కెటింగ్ రంగాల్లో మెలకువలు, శిక్షణ ఇప్పించివారిని మరింత ఉన్నతిలోకి తీసుకురావాలని సంకల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 600 మందికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్ కమిటీని ఏర్పాటుచేసింది. జిల్లాస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఇండస్ట్రీయల్, గ్రామీణాభివృద్ధిశాఖలను భాగస్వామ్యం చేసిం ది. ఈ నాలుగు శాఖలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ఎంపికచేసేలా స్టేట్లెవల్ టాస్క్ఫోర్స్ విధివిధానాలు రూపొందించింది. ఈ కమిటీ.. గ్రామీణ ప్రాంతాల్లో చిరువ్యాపారాలు, చిన్న పారిశ్రామిక యూనిట్లకు ఏ స్థాయిలో ఆర్థిక, సాంకేతిక సహాయం చేయాలి? అందుబాటులోఉన్న వనరులు ఏమిటి? అనే అంశాలపై అధ్యయనం చేయాలని జిల్లాస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి (సెర్ప్) శాఖలను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, ఇతరవర్గాల్లో ఒక్కోవర్గం నుంచి 200 చొప్పున మొత్తం 600 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపికచేసి ఈ ఏడాది చేయూతనందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎస్సీలు, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పా ర్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను రిజర్వ్ చేసింది. తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ ఎస్సీ ఎంటర్ ప్రెన్యూ ర్స్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది.