హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): అత్యంత తీవ్ర రూపం దాల్చిన బిపర్జాయ్ తుఫాను ముంబైపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం బలమైన గాలులు వీయడం వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. ఆదివారం సాయంత్రం ముంబై సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. తుఫాను నేపథ్యంలో అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకొన్నట్టు ముంబై విమానాశ్రయ అధికారులు తెలిపారు.
అయితే ప్రతికూల వాతావరణం వల్ల చాలా విమానాయాన సంస్థలు ఫ్లైట్ సర్వీసులను రద్దు చేశాయి. తమ విమానాలు కొన్ని ఆలస్యంగా నడుస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. కమర్షియల్ ఎయిర్లైన్లో రన్వేను తాత్కాలికంగా మూసివేశారు. విమాన సర్వీసుల రద్దు వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలులు వాయు నాణ్యతపైనా ప్రభావం చూపించాయి. మరోవైపు ఠాణె, రాయగఢ్, ముంబై, పాల్ఘర్ జిల్లాల్లోని కొన్ని పాంతాల్లో రానున్న 24 గంటల్లో గంటకు 45-55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ(ఐఎమ్డీ) తెలిపింది.
సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
బిపర్జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయని, సముద్రమంతా అల్లకల్లోలంగా మారిందని ఐఎమ్డీ తెలిపింది. ఈ నెల 15న తుఫాను కచ్-కరాచీ తీరాలను దాటే సమయంలో గంటకు 150 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్టు అంచనా వేసింది. కచ్, సౌరాష్ట్ర తీరానికి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలకు చెందిన సుమారు 7,500 మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నెల 15 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 16 వరకు చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లను హెచ్చరించారు. సోమవారం 56 రైళ్లను అధికారులు రద్దు చేశారు.
ఆరేబియాలో సుదీర్ఘ తుఫాను ఇదే
ఆరేబియా సముద్రంలో ఈ నెల 15న తీరం దాటనున్న బిపర్జాయ్ సుదీర్ఘ కాలం కొనసాగిన తుఫానుగా చరిత్రలో నిలిచిపోనుందని ఐఎమ్డీ తెలిపింది. సోమవారం నాటికి ఈ తుఫాను ఏర్పడి 7 రోజుల 12 గంటలైందని పేర్కొంది. 1965 తర్వాత గుజరాత్ను తాకనున్న సుదీర్ఘ తుపాను ఇదేనని తెలిపింది. ఆరేబియా సముద్రంలో అసాధారణ వేడి వల్ల బిపర్జాయ్ తీవ్ర రూపం దాల్చిందని ఐఎమ్డీ వివరించింది.