హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్ : గత కొన్నిరోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జల పరవళ్లు కొనసాగుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో ప్రస్తుతం వస్తున్న నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి మిగులు జలాలను విడుదల చేయడంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు దాదాపు 3.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 33 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్కు వరద వస్తున్నది. ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టుకు భారీ ప్రవాహం వస్తుండగా ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. సింగూరు, పోచారం ప్రాజెక్టుల నుంచి నిజాంసాగర్కు వరద వస్తుండటంతో ప్రాజెక్టు 6,7 నంబర్ గేట్ల ద్వారా 10,652 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది పరవళ్లు తొక్కుతుండటంతో సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది.
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నిత్యహారతి ఘాట్ వద్ద ఉన్న శివలింగాలు నీటమునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి 9 లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంటున్నది. 11 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద వరద గోదావరి క్రమేపీ పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 34 అడుగులకు చేరుకున్నది. మరో పది అడుగులు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశాలున్నాయి.