హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు రెడ్ అలర్ట్ (Red Alert) జారీచేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ (GHMC) అప్రమత్తం చేసింది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్ఎఫ్ (DRF) సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది. ఇక రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో హుస్సేన్సాగర్కు (Hussain Sagar) భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నది. దీంతో ట్యాంక్బండ్లో వాటర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను జీహెచ్ఎంసీ ఆదేశించింది. అదేవిధంగా ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ను కూడా పర్యవేక్షిస్తూ గేట్లు ఎత్తివేయాలని ఆదేశాలు జారీచేసింది. మూసీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.