హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వ చ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25న తూర్పు, మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న ట్టు అంచనావేసింది.
26న వాయుగుండంగా మారి 27న తీరాన్ని దాటే అవకాశాలున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో 27వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆదివారం రాష్ట్రంలోని సూర్యాపేట, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్టు వెల్లడించింది. ఆదిలాబాద్, వికారాబాద్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రికొత్తగూడెం, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసినట్టు తెలిపింది.