హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇతరులు సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను సంప్రదించొచ్చు అని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం ఫోన్ నంబర్ – 040 2111 1111.
భారీ వర్ష సూచన నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.