హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. రెండు రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తే ఈ నెల 16 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. రుతుపవనాలు ఆదివారం సిక్కిం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతోపాటు బంగ్లాదేశ్, బంగాళాఖాతంలో విస్తరించినట్టు వాతావరణశాఖ మ్యాప్ను విడుదల చేసింది. రుతుపవనాల పురోగమనం బాగానే ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. రాగల 24 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్లోని మిగిలిన భాగాలు, గుజరాత్లో కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
అల్పపీడన ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
ఈ మేరకు వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో నల్లగొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా లింగాపూర్లో 8.75 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా మెనూర్లో 8.60, మంచిర్యాల జిల్లా వెల్గనూర్లో 8.48, జగిత్యాల జిల్లా సిరికొండలో 8.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది.