హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం ప్రారంభ సీజన్ జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేవని, కానీ ఆగస్టు, సెప్టెంబర్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చి ఇప్పటికీ జోరుగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ, ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతుందని.. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైందని ప్రకటించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈనెల 11నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు తప్పవని పేర్కొన్నది.
శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. శనివారం, ఆదివారాల్లో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. గడిచిన 24గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలో అత్యధికంగా 9.15 సెం. మీ వర్షపాతం, మల్కలపల్లిలో 7.55 సెం.మీ, నల్లగొండ జిల్లా తిప్పర్తి 6.78 సెం.మీ, కట్టంగూరులో 5.07 సెం.మీ, నార్కెట్పల్లిలో 4.76 సెం.మీ, మహబూబ్నగర్ జిల్లా మూసాపేటలో 4.71 సెం.మీ, భూత్పూర్లో 4.59 సెం.మీ వర్షపాతం నమోదైందని పేర్కొన్నది.