Heavy Rains | తెలంగాణలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆదనుకొని ఉన్న అల్పపీడన ప్రాంతం కొనసాగుతుందని.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి.. దక్షిణదిశగా వొంగి ఉందని పేర్కొంది. రాబోయే 24గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు కురిసే పడే సూచనలున్నాయని వివరించింది. శుక్రవారం ఆదిలాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న ఐఎండీ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.
కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. శనివారం ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేయగా.. హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.