హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నల్గొండ జిల్లా గుండ్లపల్లెలో 6.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ తెలిపింది.