హైదరాబాద్ : రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తాజాగా ఆంధ్ర ప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.
అలాగే తూర్పు పడమర ద్రోణి ఉత్తర అండమాన్ సముద్రం నుంచి ఏపీ తీరం వరకు మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తులో ఉంది. వీటి ప్రభావంతో పాటు తిరోగమన సమయంలో రాష్ట్రంపై చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాల వల్ల గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని పేర్కొన్నది.
గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.