IMD Red Alert | తెలంగాణలో ఈ నెల 19 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడన ప్రాంతం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని.. దీనికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి.. నైరుతి దిశగా వంగి ఉందని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి ఈ నెల 18న గుజరాత్ మీదుగా అవశేష ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. కామారెడ్డి, జగితాల్యల, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. సోమవారం కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని చెప్పింది.