Heavy Rains | తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వానలు పడుతాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని చెప్పింది. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. అలాగే, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్క భారీ వానలు పడే సూచనలున్నాయని.. మిగతా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది. బుధవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, జనగాం, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12.9, రంగారెడ్డి జిల్లా ధర్మసాగర్లో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షాపాతం నమోదైంది.