మెదక్, సంగారెడ్డి జిల్లాలు జలకళను సంతరించుకున్నాయి. నాలుగురోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ప్రాజెక్టులకు గంటగంటకూ ఇన్ఫ్లో పెరుగుతున్నది. సింగూరు ప్రాజెక్టులోకి 12,515 క్యూసెక్కులు, నల్లవాగులోకి 1130 క్యూసెక్కుల వరద వచ్చింది. పలుచోట్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. మెదక్ జిల్లాలో శుక్రవారం 83.9 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, అత్యధికంగా చిలిపిచెడ్ మండలంలో 118.2 మి.మీ, అత్యల్పంగా నిజాంపేట మండలంలో 52.8 మి.మీ కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 40.3 మి.మీటర్లు నమోదవ్వగా, అత్యధికంగా పుల్కల్ మండలంలో 10.2 మీ.మీటర్ల వర్షం పడింది. జహీరాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ శరత్కుమార్, ఎమ్మెల్యే మాణిక్రావు పరిశీలించారు.
అల్పపీడనంతో నాలుగు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తప్ప ఎక్కడా జనసందోహం ఎక్కువగా కనిపించలేదు. అంతరాయం లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. మత్స్యకారులు చేపలు పడుతుండగా, ఆయా జలవనరుల వద్ద పలువరు చేపలు పట్టడం కనిపించింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, కొన్ని గ్రామాల మధ్య ఉన్న వాగుల్లో వరద ఉధృతికి రోడ్లు మునిగాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పంటపొలాల్లోకి వరద నీరు వచ్చి చేరగా, పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. – మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, జూలై 21