హైదరాబాద్, అక్టోబర్5(నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్ వరకు కొనసాగుతూ సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 9 వరకు వర్షాలు కురవవచ్చని పేర్కొన్నది.
హనుమకొండ సబర్బన్, అక్టోబర్ 5 : హనుమకొండ జిల్లాలో బుధవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానంలో దసరా ఉత్సవాలకు హాజరైన ప్రజలు వర్షం కారణంగా ఇబ్బందిపడ్డారు. గత నెలలో కురిసిన వర్షాలతో ఇప్పటికే జిల్లాల్లోని చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయి. మెట్ట పంటలకు మాత్రం పక్షం రోజుల నుంచి పదును లేకుండా పోయింది. ఈ వర్షంతో పత్తి, వేరుశనగ, మక్కజొన్న పంటలకు ప్రాణం వచ్చినట్లయింది. భారీ వర్షం కురిస్తే మాత్రం పత్తి పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.