హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 8,11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఈ నెల 9 న తెలంగాణలో అతి భారీ వర్షం నమోదవుతుందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురువనున్నాయి. నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణ శాఖ కేంద్రాలు వేర్వేరుగా ప్రకటించాయి. ప్రస్తుత ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో 20 డిగ్రీల ఉత్తరాన తూర్పు-పశ్చిమ జోన్లో కేంద్రీకృతమై ఉన్నది. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో బుధవారం ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ను గురువారం తాకింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ వ్యాపించి ఉన్నది.
రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది.ముఖ్యంగా ఈ నెల 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 9వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.