Heavy Rains | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఏకధాటిగా వర్షం
సోమవారం రాత్రి నుంచి మొదలుకొని మంగళవారం రాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురుస్తున్నది. కాళేశ్వరం వద్ద క్రమం గా వరద పెరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బరాజ్కు ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి, 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకుల గూడెం వద్ద సమ్మక్క బరాజ్కు గోదావరితో పాటు ఇంద్రావతినది వరకు భారీగా వచ్చి చేరుతుండటంతో 33 గేట్లు ఎత్తి, లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి వదులుతున్నారు.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లావ్యాప్తంగా 8.54 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెం.మీ.లు కురిసింది. బొగత జలపాతం వద్దకు పర్యాటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి: సీఎస్
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలతో ముప్పు పొంచి ఉందని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, దుర్బలమైన కాజ్వేలు, వంతెనలను ఇప్పటికే గుర్తించినట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. అగ్నిమాపక శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల కార్యాలయాల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసినట్టు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు.