TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, యానం మీదుగా సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవరణం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అలాగే, తూర్పు-పశ్చిమ ద్రోణి దక్షిణ కర్నాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.
ఈ క్రమంలో సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఇక ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. బుధవారం మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. గురు, శుక్రవారాల్లో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.
ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండలో మోస్తరు నుంచి భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా నల్గొండ జిల్లా ఉరుమడ్లలో 7.5, నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట 7.8, అమ్రాబాద్ 7, కుమ్మెర 6.8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణశాఖ వివరించింది.