హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలిచామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. సహాయక చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ప్రకటించారని నివేదించింది. ఈ వరదల వల్ల 40 మంది మరణించారని, వారి కుటుంబసభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని చెప్పింది. వరద ప్రభావం అధికంగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు హెలికాఫ్టర్లు, 27 పడవలను రంగంలోకి దింపి 655 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, సచివాయలంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అత్యవసర సేవలను పర్యవేక్షించామని వివరించింది.
వరదల వల్ల ఎవరూ కనిపించకుండాపోయిన ఘటనలు లేవని హైకోర్టుకు సమర్పించిన సమగ్ర నివేదికలో రాష్ట్ర రెవెన్యూ శాఖ (విపత్తుల నివారణ) కార్యదర్శి రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. వరద బాధితుల కోసం 177 షెల్టర్లు ఏర్పాటుచేసి 11,748 మందికి ఆశ్రయం కల్పించినట్టు తెలిపారు. వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 548 రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిలో ఇప్పటివరకు 181 రోడ్లకు మరమ్మతులు చేశామని చెప్పారు. మిగిలిన రోడ్లకు కూడా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. 774 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, వాటిలో 721 గ్రామాల్లో సరఫరాను పునరుద్ధరించామని వివరించారు. మిగిలిన గ్రామాల్లోనూ ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.